ఏపీలో సరిపడ ఎరువుల నిల్వలు.

వారిపై చర్యలు తప్పవని మంత్రి అచ్చెన్నాయుడు వార్నింగ్

జనం న్యూస్ : ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు. ఖరీఫ్-2026 వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రంలో ఎరువుల లభ్యత, సరఫరాపై ఈరోజు సచివాలయంలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, ఎరువుల కంపెనీల ప్రతినిధులు, డీలర్ అసోషియేషన్ సభ్యులతో మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… రాష్ట్రంలో రైతులకు అవసరమైన మేరకే కాకుండా, అవసరానికి మించి ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఎక్కడా ఎరువుల కొరత అనేదే లేకుండా అధికారులు, కంపెనీలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించినట్టుగా చెప్పారు. రైతులు యూరియా లేదా డీఏపీ కొనుగోలు చేసేటప్పుడు వారికి బలవంతంగా ఇతర కాంప్లెక్స్ ఎరువులను అంటగట్టే ధోరణిని డీలర్లు, కంపెనీలు వెంటనే నిలిపివేయాలని చెప్పారు. రైతులకు నచ్చిన, అవసరమైన ఎరువులను మాత్రమే అందించాలని అచ్చెన్నాయుడు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అనవసరమైన ఉత్పత్తులను బలవంతంగా విక్రయిస్తే డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా, సంబంధిత కంపెనీలపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామమని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ ఎంఆర్పీ ధరలకే ఎరువులను విక్రయించాలని చెప్పారు. ఎరువులను అధిక ధరలకు అమ్ముతూ రైతులను దోచుకోవాలని చూస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎరువులు బ్లాక్ మార్కెట్ కు తరలకుండా, పక్కదారి పట్టకుండా నిరోధించడానికి ప్రత్యేక విజిలెన్స్ బృందాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఎరువుల బస్తాకు పూర్తి లెక్క ఉండేలా పటిష్ట పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేస్తున్నామని అచ్చెన్నాయుడు అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన అక్రమాలు, అవకతవకలు ఈ ప్రభుత్వంలో పునరావృతమైతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఎరువుల బుకింగ్ యాప్ ల నిర్వహణను మరింత సులభతరం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా కౌలు రైతులు, ఆండ్రాయిడ్ ఫోన్లు లేని సాధారణ రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఓటీపీల ఆలస్యం, మెసేజ్ లింకులు అందకపోవడం వంటి సాంకేతిక సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని చెప్పారు. భూసారాన్ని రక్షించుకోవడానికి, పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవడానికి నానో యూరియా వాడకం, సహజ వ్యవసాయ పద్ధతులపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించామని తెలిపారు. రసాయన ఎరువుల మితిమీరిన వినియోగాన్ని తగ్గించి సమతుల్య పోషకాల వైపు రైతులు మొగ్గు చూపాల్సిన అవసరం ఉందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వానికి రైతుల సంక్షేమం, వారి ప్రయోజనాలే పరమావధి అని తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్ లో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తాయని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *