ఉద్దవ్‌ ఠాక్రేకు వరుస షాక్‌లు: ఎంపీలు మాత్రమే కాదు, అదే బాటలో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు?

సేన యూబీటీని దెబ్బతీసేలా షిండే భారీ వ్యుహం!

జనం న్యూస్ : మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన యూబీటీకి వరుస షాక్‌లు తగిలే అవకాశం కనిపిస్తుంది. శివసేన యూబీటీని మరింత కోలుకోలేని విధంగా దెబ్బకొట్టాలని ఏక్‌నాథ్ షిండే చూస్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన యూబీటీకి వరుస షాక్‌లు తగిలే అవకాశం కనిపిస్తుంది. గతంలో ఉద్దవ్‌ ఠాక్రేపై తిరుగుబాటు చేసి ఏక్‌నాథ్ షిండే… శివసేన పార్టీ గర్తు, పేరును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఉద్దవ్‌ ఠాక్రే ముఖ్యమంత్రి పదవి కోల్పోయేలా చేసి… తాను ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్నారు. అయితే ఈసారి ప్రస్తుతం ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన యూబీటీని మరింత కోలుకోలేని విధంగా దెబ్బకొట్టాలని ఏక్‌నాథ్ షిండే చూస్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆపరేషన్ టైగర్ పేరుతో శివసనే యూబీటీ నేతలను తమవైపునకు తిప్పుకునేందుకు శివసేన ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. తర్వాత తన నేతృత్వంలోని శివసేన మరింత బలంగా మార్చాలనేది షిండే వ్యూహంగా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… ఇప్పటికే శివసేన యూబీటీకి ఉన్న 9 మంది లోక్‌సభ సభ్యులలో ఆరుగురు డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన గూటికి చేరేందుకు రెడీ అయ్యారు. ఈ ఆరుగురు ఎంపీలు ఉద్దవ్ ఠాక్రే నిర్వహించిన శివసేన యూబీటీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి కూడా హాజరుకాలేదు. అంతేకాకుండా, ఈ ఆరుగురు ఎంపీలు కూడా లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కలిసి సభలో తమకు ప్రత్యేక సీటింగ్ కేటాయించాలని కోరినట్టుగా తెలుస్తోంది. మరోవైపు షిండే నేతృత్వంలోని శివసేనలో విలీన ప్రక్రియను కూడా కొద్ది రోజుల్లోనే ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. అయితే శివసేన యూబీటీలో చీలిక కేవలం ఎంపీల వరకే పరిమితం కాలేదని వార్తలు వస్తున్నాయి. పెద్ద సంఖ్యలో శివసేన యూబీటీ ఎమ్మెల్యేలు కూడా షిండే సేనలో చేరేందుకు రెడీ అవుతున్నారని సమాచారం. శివసేన యూబీటీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలలో కొందరు ప్రత్యేక వర్గంగా విడిపోవడానికి లేదా షిండే శివసేనలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. శివసేన యూబీటీ ఎంపీలను ఎంపీలను తమ వైపు తిప్పుకోవడంలో షిండే విజయం సాధిస్తే… రెండు నెలల వ్యవధిలోనే పలువురు శివసేన యూబీటీ ఎమ్మెల్యేలు కూడా షిండే సేనలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అంతేకాకుండా, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌‌లోని పలువురు శివసేన యూబీటీ కార్పొరేటర్లు కూడా షిండే గూటికి చేరాలని చూస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. శివసేన యూబీటీకి చెందిన కనీసం 25 మంది కార్పొరేటర్లు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని శివసేన తెలిపింది. 25 మంది కార్పొరేటర్లు తమ పార్టీ నాయకుడు ఏక్‌నాథ్ షిండేతో నేరుగా సంప్రదింపులు జరుపుతున్నారని శివసేన నాయకుడు అమే ఘోలే చెప్పుకొచ్చారు. ‘‘శివసేన యూబీటీ వర్గం తమ ప్రజాప్రతినిధులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎంపీలు, ఎమ్మెల్యేలకు పార్టీ నాయకత్వాన్ని కలిసేందుకు తగిన అవకాశాలు లభించడం లేదు. పార్టీలో అసంతృప్తికి ఇదే ప్రధాన కారణం’’ అని ఘోలే మీడియాతో మాట్లాడుతూ అన్నారు. అయితే ఈ పరిణామాలను పసిగట్టిన శివసేన యూబీటీ నేత ఉద్దవ్ ఠాక్రే పలు దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తోంది. అయితే ఏక్‌నాథ్ షిండే వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారని… ఇప్పటికే ఆరుగురు ఎంపీలు శివసేన యూబీటీకి దూరమవ్వడం దాదాపు ఖరారు కాగా, పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కూడా ఇదే బాటలో నడిచే అవకాశం ఉందని తెలుస్తోంది. శివసేన యూబీటీలో పెరుగుతున్న అసంతృప్తిని ఈ పరిణామాలు ప్రతిబింబిస్తున్నాయని షిండే వర్గం చెబుతోంది. మరోవైపు ప్రలోభాలు, ఒత్తిడి తీసుకురావడం ద్వారా ద్వారా తమ పార్టీని బలహీనపరిచేందుకు షిండే ప్రయత్నిస్తున్నారని ఉద్దవ్ ఠాక్రే వర్గం గతంలోనే ఆరోపించింది. గతంలో ఏం జరిగింది? 2022 జూన్‌లో శివసేనలో చీలిక వచ్చింది. మహా వికాస్ అఘాడి (కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన) కూటమి తరఫున ఉద్దవ్ ఠాక్రే సీఎంగా ఉన్న సమయంలోనే… శివసేన‌లోని మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేలు షిండేకు తమ నాయకుడిగా మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీలో చీలిక ఏర్పడింది. ఈ చీలిక తర్వాత ఉద్దవ్ ఠాక్రే మహారాష్ట్ర అసెంబ్లీలో మద్దతు కోల్పోయి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. మరోవైపు షిండే నేతృత్వంలోని శివసేన వర్గానికి బీజేపీ మద్దతు ఇవ్వడంతో… ఆయన సీఎం అయ్యారు. ఆ తర్వాత జరిగిన పోరాటంలో…. శివసన పార్టీ గుర్తు, పేరు షిండే వర్గానికి కేటాయించబడ్డాయి. ఆ తర్వాత అదే మాదిరిగా ఎన్సీపీలో కూడా చీలిక వచ్చిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *