అక్షర ఆయుధం : కరీంనగర్లో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో బస్సు కొంత భాగం మంటల్లో దగ్దమైంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి కరీంనగర్లో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో బస్సు కొంత భాగం మంటల్లో దగ్దమైంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… కరీంనగర్ బస్టాండ్ సమీపంలో కరీంనగర్ 2 డిపోలో బుధవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జేబీఎం ఎలక్ట్రిక్ బస్సు ఒకదానిలో మంటలు చెలరేగాయి. డిపో నుంచి బస్సును బయటకు తీస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నించారు. అలాగే, ఈ మంటలు ఇతర బస్సులకు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. అయితే జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగడానికి షార్ట్ సర్క్యూట్ కారణమా? బ్యాటరీలో సాంకేతిక లోపం కారణమా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేపట్టారు.ఈ ప్రమాదంపై ఈరోజు ఉదయం కరీంనగర్ 2 డిపో నుంచి బస్సును బయటకు తీస్తుండగా పొగలు రావడం జరిగిందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇది గమనించిన డ్రైవర్ బస్సును ఆపేశారని… వెంటనే ఫైర్ సర్వీసుకు సమాచారం అందించామని చెప్పారు. కరీంనగర్లో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులలో వరుసగా జరుగుతున్న ఈ ప్రమాదాలపై ఉన్నత స్థాయిలో దర్యాప్తు చేపట్టినట్టుగా తెలిపారు.ఇదిలాఉంటే, కొద్ది రోజుల క్రితం కరీంనగర్ శివార్లలో ఆర్టీసీకి చెందిన ఇదే రకమైన బస్సు అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. జూన్ 21న ఉదయం కరీంనగర్ నుంచి సికింద్రాబాద్ జేబీఎస్ బయలుదేరిన జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులో కొన్ని నిమిషాల తర్వాత మంటలు చెలరేగాయి. రాజీవ్ రహదారిపై అలగనూరు సమీపంలో బస్సు నుంచి మంటల వాసన రావడాన్ని డ్రైవర్ బోయిని ప్రశాంత్ గుర్తించారు. అతడు వెంటనే బస్సును రోడ్డు పక్కన నిలిపివేసి… ప్రయాణికులను కిందకు దిగాల్సిందిగా అలర్ట్ చేశాడు. దీంతో బస్సులోని దాదాపు 40 మంది ప్రయాణికులు క్షేమంగా బయటకు వచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం, ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు కిందకు దిగిన అనంతరం బస్సులో చెలరేగుతున్న మంటలను అదుపు చేసేందుకు డ్రైవర్ ప్రశాంత్ ప్రయత్నించాడు. మరికొందరు కూడా అతడికి సహకరించారు. అయితే మంటలు భారీగా ఎగసిపడటంతో అది కుదరలేదు. మరోవైపు ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అయితే ఈ ప్రమాదంలో జేబీఎం ఎలక్ట్రిక్ బస్సు పూర్తిగా దగ్దమైంది. ఈ ప్రమాదానికి గల కారణాలపై ఆర్టీసీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక, ఈ ప్రమాద సమయంలో చాకచక్యంగా వ్యవహరించి 40 మంది ప్రయాణికులను రక్షించిన బస్సు డ్రైవర్ను మంత్రి పొన్నం ప్రభాకర్ సత్కరించారు. అతడికి 10 వేల రూపాయల పారితోషికాన్ని అందించారు.అయితే 10 రోజుల వ్యవధిలోనే మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగడం ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తోంది.