వాట్సాప్‌లోనే పాఠశాల విద్యా సేవలు.. 16 కొత్త సేవలు అందుబాటులోకి!

పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. యాండ్రాయిడ్ మెుబైల్ ఉంటే చాలు ఏకంగా స్కూల్‌కి సంబంధించిన సమాచారం మెుత్తం చేతుల్లోనే ఉంటుంది అని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు వాట్సాప్ ద్వారా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సంబంధించి 16 సేవలు ప్రారంభించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. డిజిటల్ పాలనలో తెలంగాణ ప్రజాప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. విద్యాశాఖ ద్వారా అన్ని పాఠశాలల సమాచారం ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు, విద్యార్థులకు అందించనున్నారు. మీసేవ సహకారంతో వాట్సాప్ ద్వారా ఇకపై స్కూల్ అప్డేట్స్ నేరుగా వారి ఫోన్‌కు చేరనున్నాయి. ఎల్‌బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈ సేవలను అధికారికంగా ప్రారంభించారు. ఈ వినూత్న కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల మందికి పైగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాఠశాల విద్యకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం, సేవలు, ప్రభుత్వ కార్యక్రమాల వివరాలను నేరుగా వాట్సాప్ ద్వారా పొందనున్నారు. విద్యా పురోగతి, పరీక్షల సమాచారం, విద్యా సామగ్రి పంపిణీ, స్కాలర్‌షిప్‌లు, పాఠశాల కార్యక్రమాలు, ఆరోగ్య, సంక్షేమ కార్యక్రమాల వంటి అంశాలపై సకాలంలో సమాచారం అందుబాటులోకి రానుంది.

లక్షలాది మంది విద్యార్థులకు ఈ డిజిటల్ సేవలు

ఈ ప్లాట్‌ఫారమ్‌ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వ సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ (ITE&C) శాఖకు చెందిన ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ESD)-మీసేవ విభాగం, పాఠశాల విద్యా శాఖతో కలిసి అభివృద్ధి చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రులకు పారదర్శకంగా, సులభమైన రీతిలో వేగవంతమైన సేవలను అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఈ డిజిటల్ సేవలను వినియోగించుకుంటున్నారు.

వాట్సాప్ ద్వారా మీసేవ ప్రస్తుతం అందిస్తున్న ప్రధాన సేవలు:

విద్యార్థుల ప్రోగ్రెస్ రిపోర్టులు • హాల్ టికెట్ల డౌన్‌లోడ్ • మార్కుల మెమోలు • పరీక్షా ఫలితాలు • ఎస్‌ఎస్‌సీ మెమోలు • బోనఫైడ్ సర్టిఫికెట్లు • ట్రాన్స్ ఫర్ సర్టిఫికెట్లు • ఎస్‌ఎస్‌సీ మెమో సవరణల దరఖాస్తులు ఈ సేవల వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గి, సమయంతో పాటు వ్యయం ఆదా అవుతోంది.

త్వరలో అందుబాటులోకి రానున్న సేవలు

తదుపరి దశలో క్రింది సేవలను కూడా వాట్సాప్ వేదికలో అందుబాటులోకి తీసుకురానున్నారు: • యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ వివరాలు • విద్యార్థుల హాజరు సమాచారం • ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్ దరఖాస్తులు • మధ్యాహ్న భోజన పథకం వివరాలు • ఆరోగ్య, సంక్షేమ కార్యక్రమాలు • క్రీడలు, సహపాఠ్య కార్యక్రమాల సమాచారం • రెసిడెన్షియల్ పాఠశాలల సంక్షేమ కార్యక్రమాల వివరాలు • విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయ సేకరణ

డిజిటల్ మస్కట్‌గా పాలపిట్ట

ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా రాష్ట్ర పక్షి ‘పాలపిట్ట’ను డిజిటల్ మస్కట్‌గా పరిచయం చేశారు. పాలపిట్ట యానిమేషన్ వీడియోల ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులకు ముఖ్యమైన సమాచారం, అవగాహన సందేశాలు, వీడియోలు వాట్సాప్‌లో పంపించబడతాయి. దీనివల్ల ప్రభుత్వ విద్యా సమాచార ప్రసారం మరింత సులభంగా, ఆకర్షణీయంగా, ప్రజలకు చేరువ అవుతుంది.విద్యా రంగంలో సాంకేతికత వినియోగాన్ని మరింత విస్తరించి విద్యార్థుల అభ్యాస ఫలితాలను మెరుగుపరచడం, తల్లిదండ్రులతో ప్రభుత్వ అనుసంధానాన్ని బలోపేతం చేయడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజలకు చేరువైన, సమర్థవంతమైన డిజిటల్ సేవల అందింపులో తెలంగాణ మరోసారి దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు.వాట్సాప్ ఆధారిత పాఠశాల విద్యా సేవల ప్రారంభం తెలంగాణ డిజిటల్ పరివర్తన ప్రయాణంలో మరో ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది.