అక్షర ఆయుధం : మతసామరస్యానికి ప్రతీకగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన నెల్లూరులోని బారాషహీద్ దర్గా రొట్టెల పండుగ ప్రారంభమైంది.ఈ రొట్టెల పండుగ 5 రోజులపాటు కొనసాగనుంది.ఈ రొట్టెల పండుగలో పాల్గొనేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. అమరుల సమాధులను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ఏపీతోపాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి బారా షహీద్ దర్గాకు వస్తున్న భక్తులు సమాధులకు పూజలు నిర్వహిస్తున్నారు.మరోవైపు భక్తులతో స్వర్ణాల చెరువు కిటకిటలాడుతోంది. స్వర్ణాల చెరువు వద్ద భక్తులు వరాల రొట్టెలు పంచుకుంటున్నారు. దాదాపు 400 ఏళ్లకు పైగా ఇక్కడ రొట్టెలు పంచుకోవడం ఇక సంప్రదాయంగా వస్తోంది. తమ కోర్కెలు నెరవేరిన భక్తులు స్వర్ణాల చెరువులో దిగి మొక్కుబడిగా రొట్టెలను సమర్పిస్తారు. కొత్తగా కోర్కెలు కోరుకునే వారు ఆ రొట్టెలను అందుకుంటారు. ఈ రొట్టెల మార్పిడే ఈ పండుగలోని ప్రధాన ఆకర్షణ అని చెప్పుకోవచ్చు.బారా షహీద్ దర్గా చరిత్ర ఇదే బారా షహీద్ దర్గాకు ఎంతో విశిష్టత ఉంది. 400 ఏళ్ల చరిత్ర ఉంది అని స్థానికులు చెప్తుంటారు. బారా అంటే పన్నెండు. షహీద్ అంటే పవిత్రకార్యం లేదా ధర్మం కోసం ప్రాణత్యాగం చేసిన వారు అని అర్థం. ఈ బారా షహీద్ దర్గాలో 12 మంది సమాధులు దర్శనమిస్తాయి.ఈ సమాధుల వెనుక ఒక కథనం ఉంది.‘నాలుగు శతాబ్దాల కిందట మక్కా నుంచి బయల్దేరిన 12 మంది ప్రపంచవ్యాప్తంగా మత బోధనలు చేస్తూ నెల్లూరుకు వచ్చారు. వీరికి జుల్ఫేఖత్ బేగం అనే మహిళ సారథ్యం వహించారు. వీరికి అరబ్బీ భాష మాత్రమే తెలుసు. వారికి వచ్చిన కళలు, హావభావాలతోనే ఇస్లాం సూక్తులను ప్రజలకు చేరవేసేవారు. నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్ద ఉంటూ చుట్టుపక్కల ప్రాంతాల్లో మత బోధనలు చేసేవారు. ఆ సమయంలో వాలాజా నవాబు నెల్లూరును పాలిస్తుండేవారు. బీజాపూర్ సుల్తానుకు, వాలాజా నవాబుకు యుద్ధాలు జరిగేవి. అందులో వాలాజా నవాబుకు వీరు మద్దతుగా నిలిచారు. దీంతో బీజాపూర్ సుల్తానుల సైన్యం ఆ 12 మందిని అంతమొందించాలని నిర్ణయించింది. ఒకరోజు తెల్లవారుజామున ప్రార్థన చేస్తున్న సమయంలో కిందకి వంగినప్పుడు బీజాపూర్ సుల్తానుల సైన్యం ఒక్కసారిగా దాడి చేసి 12 మందిని నరికి చంపేసింది’ అనిచరిత్ర చెప్తోంది. వీరిలో జుల్ఫేఖత్ బేగంను చంపేసిన ముక్కలుగా చేశారని చరిత్ర చెబుతోంది. ‘ఆ తర్వాత వారి మృతదేహాలను గుర్రాలు తెచ్చి నెల్లూరు స్వర్ణాల చెరువు వద్ద వదిలేశాయి. ఆ క్రమంలోనే దారి మధ్యలో వారి తలలు, మొండాలు వేరు పడ్డాయి.ఆ తర్వాత ఆ 12 మందికి చెందిన గుర్రాలు సైతం తమ యజమానులు లేకపోవడంతో ప్రాణత్యాగం చేశాయి. ఈ హత్యల గురించి తెలుసుకున్న స్థానికులు ఆ 12 మందిని బారా షహీద్ దర్గా ప్రాంతంలోనే ఖననం చేశారు అని చరిత్ర చెప్తోంది. అప్పటి నుంచి భక్తులు వారి సమాధులు వరుసగా నిర్మించి ఆరాధించడం మొదలెట్టారు. అలా ప్రతి సంవత్సరం మొహరం నెలలో ఇక్కడ గంధ మహోత్సవం నిర్వహిస్తారు. ఈ గంధ మహోత్సవానికి దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. రొట్టెల పండుగ మొదలైంది ఇలా?దాదాపు 400 సంవత్సరాల క్రితం నెల్లూరును నవాబులు పాలించేవారు. వాలాజా నవాబు కుమార్తె చర్మ వ్యాధి బారినపడ్డారు.ఎంత చికిత్స చేయించినా ఎంతమంది వైద్యులకు చూపించినా అది నయం కాలేదు. అయితే ఒకరోజు స్వర్ణాల చెరువు వద్ద దుస్తులు ఉతికి అలసిపోయిన రజక దంపతులు సేద తీరుతారు. అక్కడే నిద్రపోగా రజకుడి భార్యకు కల వస్తుంది. 12మంది అమరులలో ఒకరు ఆమె కలలో కనిపించి బారా షహీద్ సమాధుల వద్ద మట్టి తీసుకెళ్లి నవాబు కుమార్తెకు రాస్తే చర్మ వ్యాధి నయం అవుతుందని చెప్పి మాయం అవుతారు.ఈ కల గురించి తెలుసుకున్న వాలాజా నవాబు సైనికులతో బారా షహీద్ సమాధుల వద్ద మట్టి తెప్పించి రాయడంతో కుమార్తె వ్యాధి వెంటనే నయమవుతుంది. దర్గా దగ్గర మట్టి పూస్తే నవాబు కుమార్తె చర్మ వ్యాధి పోయిందని పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో నవాబు కుమార్తెను చూసేందుకు చుట్టుపక్కల ఊళ్ల జనాలు భారీగా తరలివస్తారు.అదే సమయంలో వాలాజా నవాబు తరఫు బంధువులు 300 మంది వస్తారు.