సాక్షి డిజిటల్ న్యూస్ : తెలంగాణలోని ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రజాప్రభుత్వం బంపరాఫర్ ప్రకటించింది. ఒక్క రూపాయి భారం లేకుండా రూ కోటి 25 లక్షల ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పించింది. విమాన ప్రమాదం అయితే రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు రక్షణ కల్పించనుంది. అయితే ఈ ఉచిత బీమా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందికీ వర్తింపజేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో భద్రత, భరోసా కల్పించేందుకు ప్రజా ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని క్యాబినెట్ ఉద్యోగుల సంక్షేమం కోసం దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా సరికొత్త ఉచిత బీమా పథకాన్ని ఆమోదించిందని ఆయన వెల్లడించారు. ఈ పథకం ద్వారా అటు ప్రభుత్వంపై కానీ, ఇటు ఉద్యోగులపై కానీ ఒక్క రూపాయి కూడా అదనపు భారం పడకుండా బ్యాంకులతో మాట్లాడి ఈ భారీ బీమా రక్షణను కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ అద్భుతమైన బీమా పథకం ద్వారా సాధారణ ప్రమాదాల్లో మరణిస్తే రూ.కోటి 25 లక్షలు... అదే విమాన ప్రమాదం జరిగితే రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు బీమా పరిహారం అందుతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వివరించారు. 18 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల ఉద్యోగులకు రూ. 10 లక్షల జీవిత బీమా రక్షణ ఉంటుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పథకం వర్తింపు ప్రమాదవశాత్తూ శాశ్వత సంపూర్ణ వైకల్యం లేదా పాక్షిక వైకల్యం సంభవించినా ఈ పథకం ద్వారా ఉద్యోగులకు ఆర్థిక అండ లభిస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కేవలం రెగ్యులర్ ఉద్యోగులకే కాకుండా.. నెలనెలా ప్రభుత్వ రికార్డుల ద్వారా జీతం పొందే కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, ఇతర తాత్కాలిక ఉద్యోగులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు డిప్యూటీ సీఎం ప్రకటించారు. తమ కుటుంబంలో సంపాదించే వ్యక్తికి ఏదైనా ఆపద వస్తే ఆ కుటుంబం రాత్రికి రాత్రే రోడ్డున పడే పరిస్థితి ఉండకూడదు. ఉద్యోగులు కేవలం జీతగాళ్లు కాదు, వారి కుటుంబాలకు ఈ ప్రభుత్వం ఒక పెద్ద దిక్కుగా ఉంటుందని నమ్మకం కలిగించడమే మా లక్ష్యమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ఒకటో తేదీనాడే ఉద్యోగులకు జీతాలు చెల్లింపులు గత ప్రభుత్వ హయాంలో జీతాలు 15 లేదా 20వ తేదీ వరకు రాకపోవడం వల్ల ఉద్యోగులు పడిన ఇబ్బందులను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గుర్తుచేశారు. ప్రస్తుత కాలంలో ఇళ్లు, వాహనాలు, పిల్లల చదువుల కోసం ప్రతి ఒక్కరూ బ్యాంక్ ఇన్స్టాల్మెంట్స్ (ఈఎంఐలు) కడుతున్నారు. సకాలంలో జీతాలు రాకపోతే వారి అకౌంట్లు బ్యాడ్ అకౌంట్స్గా మారి సిబిల్ స్కోర్ దెబ్బతినేది. మా ప్రభుత్వం రాగానే ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉన్నప్పటికీ, సీఎం రేవంత్ రెడ్డి ‘ఉద్యోగుల హక్కులను కాపాడాలి’అని గట్టిగా నిర్ణయించుకుని...ఒకటో తేదీ నాడే జీతాలు ఇచ్చేలా కఠినమైన ప్రణాళికను అమలు చేశారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. క్యాష్ లెస్ వైద్యసేవలు అందించేలా క్యాబినెట్ నిర్ణయం ఉద్యోగ సంఘాలు ఎప్పటి నుంచో కోరుతున్న హెల్త్ కార్డ్ల సమస్యకు ప్రజా ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఒక ప్రత్యేక 'ట్రస్ట్' ద్వారా ఉద్యోగులందరికీ పూర్తి స్థాయిలో 'క్యాష్లెస్' (నగదు రహిత) వైద్య సేవలు అందించేలా క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని...దీనివల్ల ఆరోగ్య భద్రత మరింత మెరుగవుతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు.