సాక్షి డిజిటల్ న్యూస్: కేంద్రకేబినెట్ త్వరలో విస్తరణ జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి ఇద్దరు ఎంపీలకు కేబినెట్లొకి చోటు కల్పిస్తారనే ప్రచారం జరుగుతుంది. తెలంగాణలో ఓ రెడ్డి, ఓబీసీ సామాజిక వర్గాలకు చెందిన ఈటల రాజేందర్కు అవకాశం కల్పించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. గతంలో మంత్రి పదవి చివరి వరకు వచ్చి రేసులో తప్పుకోవాల్సి వచ్చింది. ఆఖరికి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి వస్తుందని భావించారు. అయితే అది కూడా వర్కౌట్ కాలేదు. దీంతో కేంద్రమంత్రి వర్గంలో ఛాన్స్ ఉందని తెలుస్తోంది. దక్షిణాదిపై భారతీయ జనతా పార్టీ కన్నేసింది. కర్ణాటక మినహా మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రాలేదు. ఎప్పటి నుంచో దక్షిణాదిలో ఒంటరిగా పాగా వేయాలని బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నప్పటికీ అవి సత్ఫలితాలను ఇవ్వడం లేదు.తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలన్నదే లక్ష్యంగా బీజేపీ తెరవెనుక ప్రయత్నాలు చేస్తోంది. 2028 ఎన్నికల్లో తెలంగాణ నుంచే విజయకేతనం ఎగురవేయాలని జాతీయ నాయకత్వం బలంగా విశ్వసిస్తోంది.ఈ క్రమంలోనే ఓటర్ల జాబితా... సామాజిక సమీకరణాలను ఎప్పటికప్పుడు అంచనాలు వేస్తోంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలంటే తెలంగాణలో బలంగా పాతుకుపోవాలని భావిస్తున్న బీజేపీ కేంద్ర కేబినెట్ విస్తరణను అందుకు అవకాశంగా మలచుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేసే సామాజిక వర్గంతోపాటు అత్యధిక జనాభా కలిగిన సామాజిక వర్గాలకు ఈసారి కేబినెట్ విస్తరణలో చోటు కల్పించాలనే యోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర కేబినెట్లోకి ఎంపీ ఈటల తెలంగాణపై బీజేపీ సీరియస్గా ఉంది. అధికారం దక్కించుకోవడమే పరమావధిగా కేంద్రం అడుగులు వేస్తోంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన అంశాలపై ఫుల్ ఫోకస్ పెట్టింది.బీజేపీకి ఒక్క స్థానం కూడా లేని రాష్ట్రాల్లో అధికార పగ్గాలు చేపట్టేలా వ్యూహాత్మకంగా అడుగులు వేసిన ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాలు ఈసారి తెలంగాణను తమ ఖాతాలోకి వేసుకోవాలనే పక్కా ప్లాన్తో అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే త్వరలో జరగబోయే కేబినెట్ విస్తరణలో తెలంగాణ నుంచి ఒకరిద్దరికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే సామాజిక సమీకరణాల ఆధారంగా ఒక ఓబీసీ, మరోకటి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం ఉండొచ్చనే ప్రచారం జరుగుతుంది. ఇకపోతే ఓబీసీ సామాజిక వర్గం విషయానికి వస్తే ఈటల రాజేందర్కు అవకాశం ఉండొచ్చనే ప్రచారం జరుగుతుంది. తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ అయినటువంటి ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీని వీడిన తర్వాత తన రాజకీయ భవిష్యత్ గందరగోళంగా మారింది. ఏ పార్టీలో చేరాలి...ఏ పార్టీలో చేరితే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి... ప్రజలు ఏ పార్టీని ఆదరిస్తారు? ఇలా రకరకాల ఆలోచనలతో సతమతమవుతున్న తరుణంలో కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా ఈటల రాజేందర్తో భేటీ అయ్యారు. పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. అమిత్ షా అభయం మేరకు ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. అనంతరం మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు.కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా అండదండలు మెండుగా ఉండటంతో ఈటల రాజేందర్కు కేంద్ర కేబినెట్లో చోటు దక్కడం ఖాయంగా ప్రచారం జరిగింది. కానీ అనూహ్య పరిణామాల నేపథ్యంలో కేంద్రమంత్రి వర్గంలో బండి సంజయ్ చోటు దక్కించుకున్నారు. చేజారిన బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కేంద్ర కేబినెట్లో చోటు దక్కకపోవడంతో ఎంపీ ఈటల రాజేందర్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేస్తారనే టాక్ వినిపించింది.ఈ మేరకు అధిస్టానం సైతం రంగంలోకి దిగింది. అయితే తెలంగాణ బీజేపీకి చెందిన కీలక నేతలు మోకాలడ్డటంతో అదికాస్తా అక్కడితో ఆగిపోయింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా చేజారిపోయింది. దీంతో మధ్యే మార్గంగా రాంచంద్రారావును బీజేపీ అధ్యక్షుడిని చేసింది. దీంతో అప్పటి నుంచి పూర్తి అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీగా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. అటు పార్టీ కార్యక్రమాల్లో అడపాదడపా కనిపిస్తున్నారే తప్ప అంత క్రియాశీలకంగా అయితే కనిపించడం లేదు. కలిసొచ్చే అంశాలు ఇవే! ఈటల రాజేందర్ బీజేపీకి చెందిన సీనియర్ నాయకుడు. ఇప్పటికే అలకపాన్పు ఎక్కి అంటీముట్టనట్లుగా ఉన్నాడు. అలాంటి ఈటెలకు మంత్రి పదవి ఇస్తే ఆయన నాయకత్వానికి, పార్టీకి కూడా బూస్టింగ్ ఇచ్చినట్టవుతుందని అధిష్టానం భావిస్తోంది.ఇప్పటికే ఈటలను బీజేపీ లో ఛాన్స్ కల్పిస్తే మరింత యాక్టివ్గా పనిచేస్తారని తెలుస్తోంది. అంతేకాదు ఈటలకు కేబినెట్లో చోటు కల్పించడం వల్ల ఈబీసీ సామాజిక వర్గాలు బీజేపీకి మరింత దగ్గరయ్యే అవకాశాలు ఉన్నట్లుతెలుస్తోంది. మరోవైపు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా అండదండలు ఈటల రాజేందర్కు మెండుగా ఉన్నాయి. మరోవైపు కేసీఆర్ కేబినెట్లో మంత్రిగా పనిచేసిన నేపథ్యంలో అవి కూడా ఈటలకు కలిసివచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన సామాజిక వర్గాల్లో ముదిరాజ్ ఒకటి. ఈటలకు ఛాన్స్ ఇస్తే ముదిరాజ్ సామాజిక వర్గాలకు మరింత దగ్గరైనట్లు ఉందని ప్రభుత్వం తెలుస్తోంది.