
జనం న్యూస్ : వైఎస్ జగన్పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన కామెంట్స్ చేశారు. వైఎస్ జగన్ను జైలులో పెట్టడం నిమిషం పని అని అన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన కామెంట్స్ చేశారు. వైఎస్ జగన్ను జైలులో పెట్టాలని అనుకుంటే, తనకు ఒక్క నిమిషం పని అని అన్నారు. చంద్రబాబు నాయుడు బుధవారం రోజున నెల్లూరు జిల్లాలోని చిల్లుకూరు మండలం పున్నపువారిపాలెం గ్రామంలో నిర్వహించిన పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా 62.20 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,712 కోట్ల మేర భరోసా పెన్షన్లను చెల్లిస్తుందని తెలిపారు. ఎన్నికల్లో పెన్షన్ పెంచి చెల్లిస్తామని మాట ఇచ్చామని, ఆ మాట నిలబెట్టుకున్నామని చెప్పారు. ఇప్పటి వరకు రూ. 68,598 కోట్ల మేర లబ్ధిదారులకు భరోసా పెన్షన్లను పంపిణీ చేశాం. అర్హులందరికీ పెన్షన్లు అందజేస్తామని తెలిపారు. ‘‘వైఎస్ జగన్ అన్యాయంగా నన్ను జైలులో పెట్టాడు... నేను అతడిని జైలులో పెట్టాలంటే ఒక్క నిమిషం పని... నాకు చేతకాదా?, అనుభవం లేదా?... నా ఉద్దేశం అది కాదు... రాష్ట్రం ఇప్పటికే నష్టపోయింది, రాష్ట్రాన్ని అభివృద్ది చేయాలనేదే నా లక్ష్యం. దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా ఏపీ ఉండాలి. ప్రపంచంలోనే నంబర్ 1 జాతిగా తెలుగు జాతి ఉండాలనేదే నా ధ్యేయం’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. గత పాలకులు నెల్లూరు జిల్లాను అశాస్త్రీయంగా విభజించారని సీఎం చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. గూడూరును తిరిగి నెల్లూరు జిల్లాలో కలుపుతామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చామని... ఆ హామీని నెరవేర్చామని తెలిపారు. వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని రాపూరు, కలవాయిపురం, సైదాపురం మండలాలను కూడా నెల్లూరు జిల్లాలో కలిపామని చెప్పారు. విజయవాడలో సాయికృష్ణను అరెస్ట్ చేసిన తర్వాత మిస్ అయ్యారని… ఈ విషయం తన దృష్టికి రావడంతోని వెంటనే సిట్ ఏర్పాటు చేశానని తెలిపారు. పోలీసులకు కూడా టెన్షన్స్ ఉంటాయని అన్నారు. రౌడీలు పోలీసులను ఛాలెంజ్ చేస్తే… పోలీసులకు కూడా రోషం వస్తుందని, వాళ్లు మనుషులేనని అన్నారు. తాను సిట్ వేసి దర్యాప్తు జరిపించాలని చూస్తే… కుల ముద్ర వేసి వివాదం సృష్టించాలని చూశారని వైసీపీపై మండిపడ్డారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై రకరకాల పోస్టులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ కూతుళ్ల మీద కూడా అసభ్యకరమైన పోస్టులు చేశారని… వారిని మానసిక క్షోభకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. వారు ఏం తప్పు చేశారని చంద్రబాబు ప్రశ్నించారు. ఇలాంటి పనులు చేసేవాళ్లు మనుషులేనా? అని మండిపడ్డారు. తాను తన జీవితంలో ఎప్పుడూ బాధపడలేదని చంద్రబాబు చెప్పారు. అయితే తన భార్యను అసెంబ్లీ సాక్షిగా దూషిస్తే… ఉక్కు మనిషినైనా తాను కూడా కుంగిపోయానని చెప్పారు. ఫస్ట్ టైమ్ తన జీవితంలో బాధపడ్డానని తెలిపారు. ఇది కుటుంబంపై ఉండే గౌరమని తెలిపారు. ఆడబిడ్డలపై సోషల్ మీడియాలో అసభ్యకరమైరన పోస్టులు చేస్తూ సైకోలు పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్ళు అసలు మనుషులేనా? అని సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.