కవిత వ్యాఖ్యలతో మరోసారి చర్చలోకి పవన్ కల్యాణ్

సాక్షి డిజిటల్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కవిత సంచలన కామెంట్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కవిత సంచలన కామెంట్స్ చేశారు. ఇడుపు కాయితం అర్థం కావాలంటే పవన్‌ కల్యాణ్‌ను అడగాలని అన్నారు. ఇడుపు కాయితం అంటే పవన్ కల్యాణ్‌కు అర్థం బాగా తెలుసునని చెప్పుకొచ్చారు. తెలంగాణ భాషను, సంస్కృతిని కించపరిచేలా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. వివరాలు... ప్రియదర్శి, నాగ దుర్గ ప్రధాన పాత్రల్లో తెరకెక్కబోతున్న తాజా చిత్రానికి ఇడుపు కాయితం అనే పేరును ఖరారు చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను ఇటీవల నిర్వహించారు. అయితే ఈ చిత్ర టైటిల్‌పై సోషల్ మీడియాలో చర్చ సాగుతుంది. ఇడుపు కాయితం పేరు చాలా బాగుందని పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. కొందరు మాత్రం ఇడుపు కాయితం పేరు మీద విమర్శలు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ వివాదంపై కవిత స్పందిస్తూ... దీనిని పవన్ కల్యాణ్‌కు ముడిపెడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఉద్యమ కాలంలో ఎలాగైతే అవాకులు చవాకులు పేలారో... మళ్లీ అదే పరిస్థితి ఇప్పుడు వస్తోంది. నిన్న గాక మొన్న... ఓ సినిమాకు ఇడుపు కాయితం అని పేరు పెట్టారు. ఇడుపు కాయితం అంటే ఏందో అర్థం అయితలేదంటా... దాని మీద ట్రోలింగ్ చేస్తున్నారు. ఇడుపు కాయితం అంటే అర్థం అయితలేదని మాట్లాడేవాళ్లు... సినిమా యాక్టర్ పవన్ కల్యాణ్‌ను పోయి అర్థం అడగండి. ఆయన అర్థం చెబుతాడు... దాని అర్థం ఆయనకు బాగా తెలుసు. మా భాషను అవహేళన చేసినందుకే ఇయ్యాల రాష్ట్రం వచ్చింది. ఇంకోసారి అటువంటి వెకిలి ప్రయత్నం చేయకండి. ఒకరి భాషను ఒకరు గౌరవించుకుందాం... ఒకరి సంస్కృతిని ఒకరు గౌరవించుకుందాం... అందరం కలిసి ఉందాం... ఇటువంటి ప్రయత్నాలు చేసి, మళ్లీ ఒకసారి తెలంగాణను అవహేళన చేస్తాం, మా భాషను కించపరుస్తాం అంటే మాత్రం చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదు. తెలంగాణ భాషను కించపరిచిన కూడా కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడలేదు. రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమానికి ఏం సంబంధం లేదు. బీజేపీ ఏం మాట్లాడదు. బీజేపీ వాళ్లకు దేశంలో ఉన్న ఇష్యూస్ తప్ప తెలంగాణ గురించి పట్టదు. బీఆర్ఎస్ పార్టీ ఏం మాట్లాడదు... బీఆర్ఎస్‌లో ఒక గుంట నక్క ఉంటాడు, ఆయనకు మొత్తం ఆంధ్రోళ్లతోనే వ్యాపారాలు’’ అని కవిత పేర్కొన్నారు. ఇక, ప్రియదర్శి, నాగదుర్గ కీలక పాత్రల్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఇడుపు కాయితం’. వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ఇటీవల ప్రారంభమైంది. బన్నీవాసు, సుకుమార్ రైటింగ్స్ పతాకంపై కలిసి నిర్మిస్తున్నారు. అయితే ఇడుపు కాయితం పేరుపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరికొందరు మాత్రం అర్థమేమిటని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అంతేకాకుండా ఆ టైటిల్‌పై పనిగట్టుకుని వివాదాలు రెచ్చగొట్టేలా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఇడుపు కాయితం అనే పదం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.ఇడుపు కాయితం అనేది తెలంగాణ గ్రామీణ పదం… దీని అర్థం విడాకుల పత్రం. భార్యాభర్తలు విడిపోవడానికి పెద్దల సమక్షంలో కుదుర్చుకున్న ఒప్పంద పత్రాన్ని ఇలా పిలుస్తుంటారు.