జనం న్యూస్ : మూసీ నది ప్రక్షాళనకు ఎలాంటి ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. దేశానికే తలమానికమయ్యే విధంగా మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని చెప్పారు. మూసీ నది ప్రక్షాళనకు ఎలాంటి ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం రోజున నల్గొండ జిల్లా కనగల్ మార్కెట్ యార్డులో హ్యామ్ రోడ్ల నిర్మాణానికి పైలాన్ ఆవిష్కరించారు. ఆ తర్వాత నల్గొండ పట్టణానికి చేరుకుని తెలంగాణ పట్టణ ఆర్థిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్లో రూ. 83 కోట్లతో చేపట్టనున్న తాగునీటి పథకానికి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎన్జీ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నల్గొండ జిల్లా అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నివేదించిన ప్రతి పనినీ చేయడానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. మూసీ కాలుష్యం కారణంగా ఇబ్రహీంపట్నం, భువనగిరి, మునుగోడు, నల్గొండ ప్రజల పరిస్థితి దారుణంగా ఉందని తెలిపారు. మూసీ ప్రక్షాళన చేస్తామంటే కొందరు కడుపులో విషయం పెట్టుకుని మాట్లాడుతున్నామని విమర్శించారు. మూసీ నదీ ప్రక్షాళన ప్రాజెక్టును ఎవరూ అడ్డుపడిన పూర్తి చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘‘మూసీ నది ప్రక్షాళన నా జీవిత లక్ష్యం. దేశానికే తలమానికమయ్యే విధంగా మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం. ఒట్టేసి చెబుతున్నా... ఎవడూ వచ్చినా, ఎవడు అడ్డం పడ్డా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా... మూసీలో వేసి తొక్కి, మూసీ ప్రక్షాళన పనులు పూర్తి చేస్తా’’ అని సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలలోపు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేసి, కృష్ణా జలాలను నల్గొండ నేల మీద పారిస్తానని తెలిపారు. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. రేషన్ కార్డు అనేది పేదవాళ్లకు గుర్తింపు అని... గత పదేళ్లలో బీఆర్ఎస్ సర్కార్ రేషన్ కార్డులు ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత లక్షలాది మంది పేదవాళ్లకు రేషన్ కార్డులు అందజేశామని అన్నారు. గతంలో పేదలకు దొడ్డు బియ్యం ఇచ్చేవారని, వాటిని బర్రెలకు దాణాగా వేసేవారని... అందుకే తాము ఆర్థికంగా భారమైనప్పటికీ సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, పేదవాళ్ల కడుపు నింపుతామని తెలిపారు. ఏడాదికి 16 వేల కోట్ల రూపాయలతో 3.28 కోట్ల మందికి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. కేసీఆర్ ఫామ్హౌస్లో ఏ సన్న బియ్యం తింటున్నారో… తెలంగాణ తండాలలో ఉన్న ఆదవాసీ సోదరులు కూడా అదే సన్న బియ్యం తింటున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పేదవాళ్ల ఆత్మగౌరవం నిలిపేలా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. పేదలు ఇళ్లు కట్టుకుంటుంటే బీఆర్ఎస్ నేతల కడుపు మసి మసి అయితుందని ఆరోపించారు. కేసీఆర్ గజ్వేల్లో ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు, కేటీఆర్ జన్వాడలో ఫామ్హౌస్ కట్టుకోవచ్చు, హరీష్ రావు మెయినాబాద్లో ఫామ్హౌస్ కట్టుకోవచ్చు… ఇలా వాళ్లు ఎకరాలకు ఎకరాలు ఫామ్హౌస్లు కట్టుకోవచ్చు గానీ, పేదలకు రూ. 5 లక్షల ఇళ్లు ఇస్తే కడుపు మంట ఎందుకని ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఏనాడూ కూడా పేదవాళ్ల కలలు సాకారం చేసేందుకు కృషి చేయలేదని విమర్శించారు. గత 30 నెలల ప్రజా ప్రభుత్వ పాలనలో ఏం సాధించామన్న అంశంలో అసెంబ్లీ వేదికగా చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. తెలంగాణలో పదేండ్లలో వందేళ్ల విధ్వంసం జరిగిందని విమర్శించారు.