
జనం న్యూస్ : నిరుపేదలకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హనుమాన్ నగర్ బస్తీ వాసులకు అండగా ఉంటామని తెలిపారు. ఇంకో సంవత్సరం ఓపిక పట్టండి... మళ్లీ రాబోయేది మన ప్రభుత్వమే. మీ అందరికీ పట్టాలు ఇచ్చే బాధ్యత మాది’బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు. ‘బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు అధికారంలో ఉన్న సమయంలో హనుమాన్ నగర్ ప్రజల జోలికి ఎవరూ రాలేదు. అలవి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను ‘గుంపు మేస్త్రి’అని చెప్పుకుంటూ నిర్మాణాలు చేయాల్సింది పోయి ప్రజల ఇండ్లను కూల్చే పనిలో పడ్డాడు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బస్తీబాట కార్యక్రమంలో భాగంగా రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని హనుమాన్ నగర్ బస్తీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. గత 60 సంవత్సరాలుగా ఆ బస్తీలో నివాసం ఉంటున్న పేద ప్రజలను అక్కడి నుండి తరలించి, ఆ భూములను అమ్ముకోవాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడుతున్న నిరుపేద కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా కల్పించారు. ఈ ప్రభుత్వానికి సగం కాలం పూర్తయింది.కానీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
అభివృద్ధిపేరుతో తెలంగాణలో లూటీలు
‘రాష్ట్రంలో అభివృద్ధి పేరుతో లూటీలు జరుగుతున్నాయి... కానీ హైదరాబాద్ నగరంలో ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. హనుమాన్ నగర్ బస్తీ మూసీకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్థానిక ప్రజలు ఐక్యంగా ఉంటే ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు.
మళ్లీ రాబోయేది మన ప్రభుత్వమే
‘కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల సమస్యలను అర్థం చేసుకునే తెలివితేటలు కూడా లేవు. ఇంకో సంవత్సరం ఓపిక పట్టండి... మళ్లీ రాబోయేది మన ప్రభుత్వమే. మీ అందరికీ పట్టాలు ఇచ్చే బాధ్యత మాది’బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పుకొచ్చారు.‘ఈ ఒక్క సంవత్సరం పాటు మీ ఇండ్లను మీరే కాపాడుకోండి... కాంగ్రెస్ నాయకుల మాటలకు మోసపోవద్దు. పెద్దలకు ఒక నీతి... పేదలకు మరో నీతి అన్నట్లుగా హైడ్రా వ్యవహరిస్తున్నది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి, ప్రస్తుతం స్థానిక ప్రజలను బెదిరింపులకు గురిచేస్తున్నారని తమ దృష్టికి వచ్చింది. మేమంతా మీకు అండగా ఉంటాం... ఎవ్వరూ భయపడకండి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండున్నర సంవత్సరాలు గడిచినా ఎన్నికల హామీల్లో ఒక్కదాన్ని కూడా అమలు చేయలేదు’అని కేటీఆర్ ధ్వజమెత్తారు.